జర్నలిస్టుల డిమాండ్ల సాధన కోసం 27న “ఛలో పార్లమెంట్”
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి
– డిమాండ్ల సాధన కోసం 27న “ఛలో పార్లమెంట్”
– జంతర్ మంతర్ వద్ద ఒక రోజు ధర్నా
– టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు
– చలో పార్లమెంట్ పోస్టర్ ఆవిష్కరణ
కరీంనగర్:
కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన జర్నలిస్టుల సమస్యల పై ఈ నెల 27వ తేదీన “ఛలో పార్లమెంట్” కార్యక్రమం చేపడుతున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు తెలిపారు. గురువారం కరీంనగర్ లోని ఫెడరేషన్ కార్యాలయ ఆవరణలో ఛలో పార్లమెంట్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుతున్నందున దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి, పార్లమెంట్ సభ్యుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలని కోరుతూ ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో పరిష్కరించాల్సిన జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ ల పునరుద్దరణ, జర్నలిస్టుల రక్షణకు పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం చేయడం, రిటైర్డ్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ పథకం, జాతీయ మీడియా కమీషన్ ఏర్పాటు, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియాకు చట్టబద్దత వంటి డిమాండ్ల ను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధనకై 27న ఢిల్లీలోని పార్లమెంట్ (జంతర్ మంతర్) వద్ద ఒక రోజు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు రైలు ప్రయాణ చార్జీల్లో 50 శాతం రాయితీ కల్పిస్తూ దాదాపు పదిహేనేళ్ళ పాటు కొనసాగిన రైల్వే రాయితీని కేంద్ర ప్రభుత్వం కోవిడ్ సందర్బంగా నిలిపివేసిందని, ఈ సదుపాయాన్ని తిరిగి పునరుద్దరించకపోవడంతో దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. జర్నలిస్టుల రైల్వే రాయితీ పాసులను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా మీడియా రంగం విస్తరించిన నేపథ్యంలో వివిధ సమస్యలను పరిష్కరించేందుకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో “నేషనల్ మీడియా కమీషన్” ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో అనేకమంది రిటైర్డ్, సీనియర్ జర్నలిస్టులకు ఎటువంటి ఆదాయ వనరులు లేక ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతున్నాయయని, కొన్ని రాష్ట్రాలలో రిటైర్డ్ జర్నలిస్టులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ స్కీం అమలు చేస్తున్నప్పటికి జాతీయ స్థాయిలో పెన్షన్ స్కీం లేకపోవడం వల్ల మిగతా రాష్ట్రాలలో ఈ స్కీం అమలుకావడంలేదని,అందుకే దేశవ్యాప్తంగా ఒకే పెన్షన్ విధానం ఉండేలా “జాతీయ పెన్షన్ పథకం” అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అనేక రాష్ట్రాలలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అక్రమ కేసులు వంటి వాటిని అరికట్టేందుకు పార్లమెంట్ లో “జర్నలిస్టుల రక్షణ చట్టం” తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు పూర్తి స్థాయిలో చట్టబద్దత కల్పించాలని అన్నారు. అదేవిధంగా పాత్రికేయ సంఘాలకు, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలకు ప్రభుత్వ భూముల కేటాయింపును నిరాకరిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించి, దేశవ్యాప్తంగా పాత్రికేయులకు ఇళ్ళస్థలాలు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్ల సాధనకై 27న జరిగే “ఛలో పార్లమెంట్” కార్యక్రమంలో జిల్లా నుంచి జర్నలిస్టులు, టీడబ్ల్యూజేఎఫ్ బాధ్యులు, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని, అదేవిధంగా ఢిల్లీ, యూపీ తదితర రాష్ట్రాలకు చెందిన ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే) నాయకులు కూడా ధర్నాలో పాల్గొంటారని తెలిపారు. ధర్నా అనంతరం పలువురు కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గాదె కరుణాకర్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు లక్కం సురేష్, కొమ్ము గణేష్, జిల్లా సహాయ కార్యదర్శులు అతికం రాజశేఖర్, గుండి కిరణ్, నాయకులు దీక్షిత్ , కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
