ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
. వాహనాల తనిఖీ అధికారి కంచి వేణు
హుజురాబాద్:
వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నియమాలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని హుజురాబాద్ వాహనాల తనకి అధికారి కంచి వేణు సూచించారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం పరకాల క్రాస్ రోడ్డు వద్ద నేషనల్ లారీ డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు ఖచ్చితంగా పాటించాలన్నారు. వాహనదారులు బయటకు వెళ్లేటప్పుడు, కుటుంబ సభ్యులు తమ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రమాదాల్లో పెద్ద దిక్కును కోల్పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందన్నారు. వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు సీటు బెల్టు పెట్టుకోవాలన్నారు. అతివేగం అనర్థదాయకమని, మద్యం తాగి వాహనం నడపవద్దన్నారు. ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని హెచ్చరించారు. ఈ విషయాలను ప్రతి వాహనదారులు గమనించాలని సూచించారు. ఎక్కువ శాతం అధిక వేగంతో రోడ్డుపై వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతున్నదన్నారు. రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్క వ్యక్తి నిబంధనలు పాటించి ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా వాహనాలను నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ నాగరాజు, హోంగార్డ్ గుర్రం శ్రీకాంత్ గౌడ్, లారీ డ్రైవర్లు పాల్గొన్నారు.
