విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
– బి కే శ్రీవాణి
– నషా ముక్త్ భారత్ కోసం విద్యార్థుల ర్యాలీ
హుజురాబాద్:
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని హుజురాబాద్ బ్రహ్మకుమారి సెంటర్ ఇంచార్జ్ బి కే శ్రీవాణి సూచించారు. బ్రహ్మకుమారిస్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని కాకతీయ కళాశాల విద్యార్థులచే నషా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసైతే జీవితాలు నాశనం అవుతాయన్నారు. తల్లిదండ్రుల కలలను సహకారం చేసే దిశగా విద్యార్థులు సన్మార్గంలో పయనించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో దేశంలో 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన జీవితం కోసం, సామరస్య కుటుంబం, ఉజ్వల భవిష్యత్తు, అభివృద్ధి చెందిన దేశం కోసం ప్రతి ఒక్కరూ వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేయాలని కోరారు. యోగ జీవన విధానాన్ని అవలంబించి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని సూచించారు. మాదకద్రవ్య రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతతో ముందుకు సాగాలన్నారు. అనంతరం విద్యార్థులచే వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు గుంటి రాజయ్య, శివరాత్రి ఈశ్వరయ్య, జ్యోతి రాణి, కళాశాల అధ్యాపకులు వేణు, రాజేశ్వర్ రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

