రేడియోలపై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి…
రేడియోలపై పెరుగుతున్న ఆసక్తి…
. మదర్ ఫౌండేషన్ అధ్యక్షులు మోటె చిరంజీవి
. రేడియో శ్రోతలకు ఘన సన్మానం
వరంగల్:
ఈ ఆధునిక కాలంలో రేడియోల పై ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్నదని, వాటిని విని ఆనందించేటువంటి శ్రోతలు ఉండటం అభినందనీయమని మదర్ ఫౌండేషన్ అధ్యక్షులు మోటె చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా వరంగల్ కాశిబుగ్గలోని మదర్ ఫౌండేషన్ కార్యాలయంలో మదర్ థెరిసా జయంతి సందర్భంగా రేడియో శ్రోతలను మదర్ ఫౌండేషన్ అధ్యక్షులు మోటె చిరంజీవి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ… గత 15 సంవత్సరాల నుండి వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి అనేక అవార్డులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి ఏకైక స్వచ్ఛంద సంస్థ మదర్ ఫౌండేషన్ అని అన్నారు. ఈ సంవత్సరం మదర్ థెరీసా జయంతి సందర్భంగా శ్రోతలను సన్మానించడం జరిగిందన్నారు. వివిధ ప్రాంతాలు, జిల్లాల నుంచి కూడా శ్రోతలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. మదర్ ఫౌండేషన్ సంగీత, సాహిత్య,సామాజిక, స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు, డాక్టర్లకు, లాయర్లకు, సినీ కళాకారులకు, వివిధ స్వచ్ఛంద సంస్థల సేవా ప్రతినిధులకు అనేక అవార్డులు ఇస్తూ ప్రోత్సహిస్తుందని అన్నారు. గత 40 సంవత్సరాల నుండి ఇప్పటికీ రేడియో ను వింటూ ఆ కార్యక్రమాలకు వారి యొక్క అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా తెలుపుతూ వారి స్వభిమానాన్ని చాటుతున్నటువంటి రేడియో శ్రోతలు ఉండడం, కొన్ని సంవత్సరాల కిందటే వారు ఒక అసోసియేషన్ గా ఏర్పడడం గర్వించదగ్గ విషయమన్నారు.
మదర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం: కుసుమ లింగమూర్తి
అలయన్స్ క్లబ్ సౌత్ ఇండియా మల్టిపుల్ జాయింట్ సెక్రెటరీ, ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ కుసుమ లింగమూర్తి మాట్లాడుతూ…మదర్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. ఆకాశవాణి పై మక్కువతో ఒక శ్రోత తన చేతి పైన ఆకాశవాణి పచ్చబొట్టు వేసుకోవడం కూడా గర్వించదగ్గ విషయమన్నారు. వీరిని గుర్తించి సన్మానించినటువంటి మదర్ ఫౌండేషన్ అధ్యక్షులు మోటె చిరంజీవిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మదర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి తులసి, రేడియో శ్రోతల సంఘం అధ్యక్షులు గోనె రవి, ప్రధాన కార్యదర్శి అమరేందర్, శ్రోతలు దాసి రామచంద్రం, గట్ల వెంకటేష్, గంగు మహేందర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
