స్నేహపూర్వకంగా పనిచేయాలి
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
. మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట:
ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో, స్నేహపూర్వకంగా పనిచేయాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. పొన్నం ప్రభాకర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ అధికారులతో తొలిసారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అధికారులు ప్రజలతో మమేకమై పని చేయాలన్నారు. ప్రభుత్వం మారిందని, ప్రజలు మార్పు కోరుకున్నారని ప్రభుత్వ అధికారుల పనితీరు కూడా మారాలని, చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ లు గరిమా అగర్వాల్, శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేత, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సరోజ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.