నిర్దేశిత లక్ష్యం మేరకు పన్ను వసూలు లక్ష్యం సాధించాలి!
- నాన్డ్యూటీ పెయిడ్ లిక్కర్ రవాణా అరికట్టాలి
- వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖకు సొంత భవనాలు ఉండాలి
- సమగ్రమైన ఇసుక విధానంతో అక్రమాలను అడ్డుకోవాలి
- గనుల శాఖ విధించిన జరిమానాలు వసూలు చేయాలి
- ఏళ్లుగా తిష్టవేసిన అధికారులను బదిలీ చేయాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్:
పన్ను వసూళ్లలో నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని అన్ని శాఖలు సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి వాణిజ్య పన్నులు,ఆబ్కారీ, రిజిస్ట్రేషన్లు,రవాణా,గనులు, భూగర్భ వనరుల శాఖ పన్ను వసూళ్లపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు.
వాణిజ్య పన్నుల శాఖలో పన్ను లక్ష్యానికి, రాబడికి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఎందుకు ఉందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది వరకు జీఎస్టీ పరిహారం కింద రూ.4 వేల కోట్లకుపైగా చెల్లించేదని, దాని గడువు ముగియడంతో ఆ నిధులు రాకపోవడంతో రాబడిలో వ్యత్యాసం కనిపిస్తోందని అధికారులు తెలిపారు