రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలకు పెంపు

పేదలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించాలి
. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పేర్కొన్నారు.

వరంగల్:
పేదలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించాలనే లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని దీనికి అనుగుణంగా పని చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పేర్కొన్నారు. శనివారం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి అకడమిక్ హాల్ నందు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం వైద్య సాయం 10 లక్షలకు పెంపు కార్యక్రమాన్ని ఎంజిఎం సూపరిండెంట్ చంద్రశేఖర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, ఆర్ఎంఓ మురళి, ఆరోగ్యశ్రీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అభిలాష్, కేఎంసి ఇన్చార్జి ప్రిన్సిపల్ రాంకుమార్ రెడ్డి తో కలిసి వరంగల్ జిల్లా తరఫున జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ లాంఛనంగా రాష్ట్ర రాజధానిలో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబడిందని, దీనికనుగుణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామని చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సదుపాయం పథకం ద్వారా ఇంతకుముందు ఐదు లక్షల వరకు వైద్య సహాయము, ఆరోగ్య బీమా ఉండేదని, దానిని కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల వరకు ఆరోగ్య బీమా, వైద్య సహాయం ప్రజలకు అందుబాటులోకి తేవడం శుభ పరిణామమని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 2 లక్షల 66 వేల 678 మందికి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులు కలవని, రాష్ట్రంలోని నిరుపేదలు, వైద్య ఖర్చులకు డబ్బులు లేని నిస్సహాయులు ఈ పథకం ద్వారా జిల్లాలోని 5 ప్రభుత్వ ఆసుపత్రులలో, 12 ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యాన్ని పొందవచ్చన్నారు. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఉచిత వైద్యం, భోజనం, మరియు రవాణా సౌకర్యం అందించబడుతుందన్నారు. ఈ పథకాన్ని ఆరోగ్య సిబ్బంది విస్తృతంగా క్షేత్ర స్థాయిలో ప్రజలలో తీసుకువెళ్లాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం ఆసుపత్రి వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.