దరఖాస్తు చేసుకోవాలి
ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
హనుమకొండ :
అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హనుమకొండ నక్కలగుట్ట లోని వాటర్ ట్యాంక్ వద్ద అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణకు ప్రజాపాలన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ చదివి వినిపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడారు. ప్రభుత్వం అందించనున్న పథకాలకు ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి దరఖాస్తులను ఈనెల 6 వరకు స్వీకరిస్తున్నామని తెలిపారు. దరఖాస్తు పత్రంలో సరైన వివరాలను నింపి ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ లను జత చేసి వార్డు సభ, గ్రామసభల్లో అందజేయాలన్నారు. దరఖాస్తు ఫారాలు సరిపోను ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని ఒకవేళ ఇంకా అవసరమైతే దరఖాస్తు ఫారాలను సిద్ధం చేస్తామన్నారు. ప్రజా పాలన కౌంటర్ల వద్ద దరఖాస్తు ఫారాలను తీసుకోవచ్చని ప్రజలకు సూచించారు. దరఖాస్తు పత్రం నింపేటప్పుడు ఏవైనా సందేహాలు ఉంటే ప్రజా పాలన కౌంటర్ల వద్ద హెల్ప్ డెస్క్ ల వద్ద ఉండే అధికారులను అడగవచ్చునని పేర్కొన్నారు. ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ఆరో తేదీ వరకు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రజాపాలన నిర్వహించే ఒక్కో వార్డు సభలో దరఖాస్తుదారుల నుండి పత్రాలను స్వీకరించేందుకు పది కౌంటర్ల వరకూ ఏర్పాటు చేశామని అన్నారు. కౌంటర్లను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయడం వలన ప్రజల నుండి ఎప్పటికప్పుడు దరఖాస్తు లను స్వీకరిస్తున్నారని దీంతో జనం ఎక్కువగా ఉండడం లేదని, కావున హడావుడి లేదన్నారు. ప్రశాంత వాతావరణం ఉన్నందున సరైన వివరాలతో దరఖాస్తు పత్రాన్ని నింపి వార్డు సభలు నిర్వహించే కౌంటర్ల వద్ద ప్రజలు అందజేయాలన్నారు. ఒక కుటుంబానికి ఒకే దరఖాస్తు ఫారం ఇవ్వడం జరిగిందని, దానిలోనే అభయ హస్తం గ్యారెంటీలకు సంబంధించిన పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గడువు తేదీనాటికి ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈ సంతోష్ బాబు, ఇతర అధికారులు, డివిజన్ వాసులు పాల్గొన్నారు.