ప్రతిపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలి
ఆర్టీసీని గాలికి వదిలేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం…
. ప్రతిపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలి
. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖామంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట:
గత ప్రభుత్వం ఆర్టీసీని గాలికి వదిలేసి సంస్థను నిర్వీర్యం చేసిందని, ఆర్టీసీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆయన మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ, ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ను మంత్రి పరిశీలించారు. ప్రయాణికులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహాలక్ష్మి పథకం అమలుపై మహిళలను అడిగారు. గత ప్రభుత్వం ఆర్టీసీని గాలికి వదిలేసిందని ఆరోపించారు. మరికొన్ని నూతన బస్సులను ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల స్పందిస్తూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు కాకముందే ప్రతిపక్షాలైన బిఆర్ఎస్ బిజెపి లు చేస్తున్న వ్యాఖ్యల పట్ల సభ్య సమాజం అసహ్యించుకుంటున్నదని అన్నారు. ప్రతిపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని, ప్రభుత్వంలోని లోటుపాట్లను చూపి, ప్రజాస్వామిక విలువలను కాపాడాలన్నారు. ప్రభుత్వం పై చేస్తున్న వ్యాఖ్యలను విరమించుకోకపోతే గట్టిగా జవాబు చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. సంవత్సరంలోపు కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల పై మండిపడ్డారు. రాజాసింగ్ ఏమైనా జ్యోతిష్యం తెలుసా అని ప్రశ్నించారు. బిజెపి బీఆర్ఎస్ లు వేరువేరు కాదని, వారి కుట్ర అందరికీ అర్థమైందన్నారు. కాంగ్రెస్ లో గెలిచిన ఏ ఒక్క నాయకుడు పార్టీని వదిలి వెళ్ళడని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ప్రజా అభిప్రాయాల మేరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన కాంగ్రెస్ ప్రభుత్వం లో ప్రజలు పూర్తి స్వేచ్ఛతో తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకోవచ్చని తెలిపారు.