రేకుర్తిలో సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న మంత్రి పొన్నం
కరీంనగర్:
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి లో సమ్మక్క సారలమ్మను బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బంగారం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కూలి పోతుందని కొన్ని రాజకీయ పార్టీలు ప్రగల్బాలు మాట్లాడుతున్నారని, తమకు అండగా సమ్మక్క సారక్క ఉన్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని ఎవరూ టచ్ చేయలేరని పేర్కొన్నారు.
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం తమ ప్రజా ప్రభుత్వం అని వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లు అమలు చేస్తామని హామీనిచ్చారు. ప్రభుత్వం ఏర్పడి 70 రోజులు కూడా కాలేదని, అప్పుడే విమర్శలు చేస్తున్నారని తెలిపారు.
‘‘మా ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడు..మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే అమ్మవారు మొట్టికాయలు వేస్తారు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ని ఉద్దేశించి మాట్లాడారు. మంత్రి వెంట మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.