నా చివరి ఊపిరి వరకు కేసీఆర్ తోనే ఉంటా.. పాడి కౌశిక్ రెడ్డి

నా చివరి ఊపిరి వరకు కేసీఆర్ తోనే…
. ఆదరించిన హుజురాబాద్ ప్రజలకు సలాం..
. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..
. ఫేక్ ప్రచారాలు నమ్మొద్దు..
. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్:
నా చివరి ఊపిరి వరకు కేసీఆర్ తోనే, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి హుజురాబాద్ టికెట్ ఇవ్వడంతో పాటు గత కొంతకాలంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన కేసీఆర్ కే తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. తాను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోను ఇప్పటి ఫోటోగా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు ఊపిరి ఉన్నంతవరకు కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తనపై అభిమానం చూపించి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి సలాం చెప్పారు. హుజురాబాద్ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, హుజురాబాద్ అభివృద్ధి కోసమే తాను పాటుపడతానని, ప్రజలకు ఎన్నికలు సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేయాలని కోరారు. సంక్షేమ పథకాల అమలుతోపాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు. హుజురాబాద్ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే సతీమణి శాలిని రెడ్డి, కూతురు శ్రీనికలు మాట్లాడుతూ.. నమ్మకంతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. హుజురాబాద్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే తో పాటు తాము కూడా కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.