తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ

0

కేసీఆర్ కుటుంబం తో సహా బీఆర్ఎస్ నాయకుల పాస్ పోర్టులను సీజ్ చేయండి
. బంగారు పళ్లెంలో పెట్టి తెలంగాణను అప్పగించామని బీఆర్ఎస్ నేతలు చెప్పడం సిగ్గు చేటు
. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్
. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు…
. 350 సీట్లతో మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం
. తెలంగాణలోనూ కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ
. బీజేపీ గెలుపే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపు

 

కరీంనగర్:
అధికారంలో ఉన్నన్నిన్నాళ్లు అవినీతి, అరాచకాలతో చెలరేగిపోయి ప్రజల సొమ్మును దోచుకుతిన్న కేసీఆర్ కుటుంబ సభ్యులుసహా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన బీఆర్ఎస్ నేతల పాస్ పోర్టులను సీజ్ చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లేనిపక్షంలో వారంతా విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని, వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉండదని చెప్పారు. కేసీఆర్ హయాంలో పదవీ విరమణ చేసినప్పటికీ సీఎంఓలో పనిచేస్తూ అడ్డగోలుగా దోచుకుంటూ కేసీఆర్ కుటుంబానికి దోచిపెట్టిన అధికారుల పాస్ పోర్టులను సైతం సీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్ ను ఈ విషయంలో మినహాయించాలని కోరారు. కరీంనగర్ లోని ఈఎన్ గార్డెన్ లో శనివారం మధ్యాహ్నం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ పదాధికారుల సమావేశం జరిగింది. కరీంనగర్, వేములవాడ జిల్లాల అధ్యక్షులతోపాటు రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమదేవి సహా మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఆ పైస్థాయి నాయకులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. దీంతోపాటు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఉద్దేశాలను వివరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మినహా ఓడిపోయిన ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులంతా అవినీతి, అరాచకాలకు పాల్పడ్డారు. ప్రజల సొమ్మును దోచుకుతిన్నారు. వెంటనే వాళ్ల అవినీతిని బయటపెట్టాలి. వాళ్లపై చర్యలు తీసుకోవాలి. అంతకంటే ముందే వాళ్ల పాస్ పోర్టులన్నీ రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేయాలి. లేకుంటే విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉంది. వీరితోపాటు ఇన్ని అరాచకాలకు కారకులైన కేసీఆర్ సీఎం ఉండగా సీఎంఓలో పదవీ విరమణ చేసిన అధికారులు అడ్డగోలుగా సంపాదించి ప్రజల ఆస్తులను దోచుకుని తెలంగాణను సర్వనాశనం చేశారు. వాళ్ల పాస్ పోర్టును కూడా స్వాధీనం చేయాలి. కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నందున ఆరోగ్యం కుదటపడే వరకు ఈ విషయంలో ఆయనను మినహాయించాలి’’అని డిమాండ్ చేశారు.

 

బిఆర్ఎస్ నాయకుల మాటలు సిగ్గుచేటు…
బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్ చేతిలో తెలంగాణను పెట్టామంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సహా బీఆర్ఎస్ నేతలు చెబుతుండటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఆ మాటలు అనడానికి సిగ్గుండాలే… తెలంగాణ బంగారు పళ్లెమే అయితే ఫస్ట్ నాడే జీతాలెందుకివ్వలేకపోయారు? 6 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణను సర్వనాశనం ఎందుకు చేశారు? ప్రభుత్వ భూములన్నీ ఎందుకు అమ్ముకున్నారు? నిరుద్యోగులకు ఉద్యోగాలెందుకియ్యలేదు? నిరుద్యోగ భ్రుతి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.

బిజెపి మూడోసారి అధికారంలోకి రాబోతుంది…
పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, దేశమంతా మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ గాలి వీస్తోందన్నారు. 350 ఎంపీ స్థానాలతో మూడోసారి మోదీ అధికారంలోకి వస్తారని సర్వే సంస్థలు చెబుతున్నాయన్నారు. తెలంగాణలోనూ మోదీగాలి వీస్తోందన్నారు. బిజిపి కి పోటీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీలో కూడా ఉండదన్నారు. కార్యకర్తలు చేయాల్సిందల్లా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఇంటింటికీ తీసుకెళ్లడమే అన్నారు. ఇకపై ప్రతి ఒక్కరూ బీజేపీ గెలుపే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *