సీఎం రేవంత్ రెడ్డి కి బండి సంజయ్ బహిరంగ లేఖ..

0

సిరిసిల్ల చేనేత కార్మికులను అన్ని విధాల ఆదుకోవాలి

. ఎంపీ బండి సంజయ్ కుమార్

గౌరవనీయులైన ఏ.రేవంత్‌ రెడ్డి గారికి,
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,
సచివాలయం, హైదరాబాద్‌.

విషయం : సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతూ…..

నమస్కారం …

సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ రంగంపై ఆధారపడ్డ 20 వేల మంది కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 33 వేల మరమగ్గాలుండగా, ఇందులో 28 వేల మగ్గాలపై పాలిస్టర్‌ వస్త్రాలు, 5 వేల మగ్గాలపై కాటన్‌ వస్త్రాలు తయారవుతున్నాయి. ఉత్పత్తి వ్యయం పెరగడం, పాలిస్టర్‌ బట్టకు గిట్టుబాటు ధర, సరైన మార్కెట్‌ లేకపోవడంతో సిరిసిల్లలో సాంచాలను బంద్‌ పెట్టారు. దీనికి ప్రధాన కారణం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోపాటు ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలే.
గత ఏడేళ్లుగా ప్రభుత్వ ఆర్డర్లపైనే ఆధార పడి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మనుగడ సాగిస్తోంది. వస్తోత్పత్తిదారులు సొంతంగా వస్త్ర వ్యాపారం చేయడం లేదు. ప్రధానంగా బతుకమ్మ చీరలకు సంబంధించి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కార్మికులకు రూ.220 కోట్లను బకాయి పెట్టింది. ఈ బకాయిలు రాకపోవడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ బకాయిలను చెల్లిస్తామని అప్పటి మంత్రి, స్థానిక శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు పలుమార్లు హామీ ఇచ్చినా చెల్లించలేదు. చివరకు ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి బకాయిలు చెల్లించలేదు. కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మీరు ఈ మొత్తం బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతున్నా. అట్లాగే ప్రభుత్వ ఆర్డర్లతో సిరిసిల్ల కార్మికులు ఉపాధి పొందుతున్న నేపథ్యంలో మీరు ప్రత్యేక చొరవ తీసుకొని భారీగా ప్రభుత్వ ఆర్డర్లను ఇచ్చి సిరిసిల్ల కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నా.
సిరిసిల్లలో నేత కార్మికులను ఓనర్లుగా మార్చేందుకు 2017 అక్టోబర్‌ 11న అప్పటి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ‘‘వర్కర్‌ టు ఓనర్‌’’ పథకం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తొలి విడతలో ఈ కార్యక్రమానికి రూ.220 కోట్లను కేటాయిస్తున్నామని, 1104 మంది కార్మికులను మొదటి దశలో ఓనర్లుగా మారుస్తామని ప్రకటించారు. కానీ ఇంతవరకు ఇవి అమలు కాలేదు. మీరు కార్మికుల సంక్షేమం కోసం తక్షణమే ఆ నిధులు కేటాయించి నేత వర్కర్లను ఓనర్లుగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కోరుతున్నా.
సిరిసిల్లలో మరమగ్గాలను ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరమగ్గాల ఆధునీకరణకు అవసరమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే సిరిసిల్లలో మెగా పవర్‌ లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రతిపాదనలు పంపితే దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా మంజూరు చేయించేందుకు నా వంతు కృషి చేస్తాను.

భారత మాతాకీ జై….

అభినందనలతో …

బండి సంజయ్‌ కుమార్‌,
కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యులు,
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *