ఎమ్మెల్సీ అభ్యర్థిగా బల్మూరి వెంకట్..
ఎమ్మెల్సీ అభ్యర్థిగా బల్మూరి వెంకట్..
హుజురాబాద్:
ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. రాష్ట్రంలో విద్యారంగ, నిరుద్యోగ సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేస్తున్న బల్మూరి వెంకట్ 2021లో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఉప ఎన్నికల వరకు హుజురాబాద్ నియోజకవర్గానికి సరైన నాయకుడు లేకపోవడం చివరి నిమిషంలో వెంకట్ కు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించడంతో నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసే సమయం లేక ఓటమి పాలయ్యారు. 2021 నుండి 2023 సాధారణ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేశారు. నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేస్తూ నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. కార్యకర్తలకు నేనున్నాననే ధైర్యాన్ని కల్పించారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించారు. కాగా 2023 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో హుజురాబాద్ టికెట్ ఆశించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ సీట్ల సర్దుబాటు, అధిష్టానం ఆదేశాల మేరకు పోటీ చేసే ఆలోచనను విరమించుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఎమ్మెల్సీ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ ను ప్రకటించింది. వెంకట్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.