దళితులను అరెస్టు చేయడం హేయం
![](https://navatelanganabapurao.com/wp-content/uploads/2024/02/Padi-Kaushik-Reddy1111.jpg)
- దళితులను అరెస్టు చేయడమే ప్రజాపాలననా?
- వెంటనే రెండో విడత ‘దళిత బంధు’ అమలు చేయాలి
- దళిత బందు ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు
- హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్:
హుజురాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసిన ‘దళిత బంధు’ రెండో విడత కోసం కలెక్టరేట్ లో ప్రజావాణిలో అభ్యర్థన పెట్టుకునేందుకు వెళ్లిన దళితులను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేయడం హేయనియమైన చర్య అని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ‘దళిత బంధు’ కోసం కలెక్టరేట్ కు వెళ్లిన దళితులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వారిని ఉద్దేశించి సోమవారం ఆయన మాట్లాడారు.
దళిత బంధు రెండో విడత 2,800 మందికి ఐదు లక్షలు రావాల్సి ఉందని, వెంటనే దళితులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం హుజురాబాద్ నియోజకవర్గం లోని అర్హులైన దళితుల అందరి అకౌంట్లో 10 లక్షలు జమ చేశారని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీజ్ చేసిందని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ‘దళిత బంధు’ డబ్బులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆపుతుందో చెప్పాలన్నారు. రెండో విడత కోసం వెళ్లిన దళితులను అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ నిరసనగా నల్ల చొక్కా ధరించానని తెలిపారు. ఇప్పటికే అసెంబ్లీలో కూడా ‘దళిత బంధు’ గురించి ప్రస్తావించానని, అయినప్పటికీ దళితులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. పేద దళితుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రాజకీయం చేస్తుందో చెప్పాలన్నారు. కరీంనగర్ జిల్లాలో పెద్ద మంత్రిని అని చెప్పుకునే వ్యక్తి దళితులను అరెస్టు ఎందుకు చేయించారని, ఇదేనా ప్రజా పాలన అంటే అని ఆయన ప్రశ్నించారు. రెండో విడత దళిత బంధు వెంటనే విడుదల చేయాలని లేనియెడల హుజురాబాద్ నియోజకవర్గం లో దళితులందర్నీ ఏకం చేసి తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు చేస్తానని హెచ్చరించారు.