20 వేల మందితో ఆత్మీయ సమ్మేళనం
![](https://navatelanganabapurao.com/wp-content/uploads/2023/12/IMG_20231214_181544-1024x781.jpg)
ఈ నెల 16న బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ నేతల విస్తృత సమావేశం..
. దిశా నిర్దేశం చేయనున్న బండి సంజయ్
. పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం చేయడమే ప్రధాన లక్ష్యం
. 20 వేల మందితో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు సన్నహాలు
కరీంనగర్:
ఈనెల 16న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో శనివారం ఉదయం 11 గంటలకు కరీంనగర్ లోని ఈఎన్ గార్డెన్స్ లో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 5 జిల్లాల అధ్యక్షులు, ఆఫీస్ బేరర్స్ తోపాటు 40 మండలాల పరిధిలోని మండలాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మొదలు జిల్లా, రాష్ట్రస్థాయి ఆఫీస్ బేరర్లను ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిపై చర్చించడంతో పాటు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రణాళిక రూపొందించనున్నారు. బీజేపీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో కార్యకర్తల్లో స్తబ్దత నెలకొన్న నేపథ్యంలో వారిని యాక్టివేట్ చేయడమే లక్ష్యంగా బండి సంజయ్ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. అదే విధంగా పార్లమెంట్ సమావేశాల అనంతరం కరీంనగర్ పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. తద్వారా గ్రామ, మండల స్థాయిలోని కార్యకర్తలందరినీ ఎన్నికలకు సమాయత్తం చేసేలా బండి సంజయ్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. అందులో భాగంగానే ఈ నెలాఖరులో కరీంనగర్ పార్లమెంట్ నియోకవర్గ పరిధిలోని దాదాపు 20 వేల మంది బీజేపీ కార్యకర్తలతో కరీంనగర్ లో ఆత్మీయ సమ్మేళం నిర్వహించేందుకు బండి సంజయ్ సిద్ధమవుతున్నారు. పొలింగ్ బూత్ అధ్యక్షుల నుండి పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలంతా ఈ సమావేశానికి ఆహ్వానించనున్నారు. అట్లాగే పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తలను గుర్తించి వారిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించనున్నారు. అందులో భాగంగా ఒక్కో మండలం నుండి కనీసం వంద మంది కార్యకర్తలను జాబితాను సిద్దం చేసి వారిని ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించనున్నారు. వేలాది మంది కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నందున అందుకు తగిన వేదికను జిల్లా నేతలు పరిశీలిస్తున్నారు. కరీంనగర్ లోని ఎస్సారార్ కళాశాల మైదానం ఈ సమావేశానికి తగిన వేదిక అవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. రెండ్రోజుల్లో ఈ సమావేశ తేదీని, వేదికను ఖరారు చేయనున్నారు.