ఉచిత విద్యుత్ మొదటగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే.

కాంగ్రెస్ తోనే భవిష్యత్తు…
. ఉచిత విద్యుత్ మొదటగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే..
. బిజెపి, బిఆర్ఎస్ మాయ మాటలకు మోసపోవద్దు
. కాంగ్రెస్ అభ్యర్థి వొడితల ప్రణవ్

హుజూరాబాద్ :
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే భవిష్యత్తు బాగుంటుందని ఆ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని జమ్మికుంట హుజురాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు మొదటగా అందించింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీల అమలు చేస్తామన్నారు. బిఆర్ఎస్, బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీ బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీల మాయ మాటలను ప్రజలు ఎవరు నమ్మవద్దని కోరారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉందని, అక్కడ రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 62 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని హామీలన్నీ అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కాపీ చేసి పింఛన్లు పెంచేస్తామని బిఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుందని, ఉన్న పింఛన్లు సమయానికి ఇవ్వడం లేదు కానీ కొత్త పింఛన్లు ఇస్తామని హామీ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు.
ఉద్యోగ ఖాళీల భర్తీ…
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. యువకులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు సరైన వసతులు లేవని, తనను గెలిపిస్తే హుజురాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో డిజిటల్ లైబ్రరీలతోపాటు స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తానన్నారు. మండలానీకో ఇంటర్నేషనల్ స్థాయి పాఠశాల ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి విద్యానందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రెండు దశాబ్దాలుగా ప్రజలు ఈటెల రాజేందర్ ను గెలిపిస్తూ వస్తున్నారని, ఈ నియోజకవర్గ ప్రజలను కాదని గజ్వేల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు. గజ్వేల్ కు వెళ్లి గజ్వేల్ ముద్దుబిడ్డనని, హుజురాబాద్ కు వచ్చి హుజురాబాద్ బిడ్డనని చెప్తున్నాడన్నారు. ఏడుసార్లు అవకాశం ఇచ్చినప్పటికీ ఈ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల్లో గెలిచి మూడేళ్లు గడుస్తున్న హుజురాబాద్ కు చేయలేదని, కనీసం తన సొంత మండలంలోని ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయలేని పరిస్థితిలో ఈటల రాజేందర్ ఉన్నారన్నారు. బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని బిజెపికి ఓటు వేస్తే టిఆర్ఎస్ కు వేసినట్టేనని, టిఆర్ఎస్ కు వేస్తే బిజెపికి వేసినట్లేనని తెలిపారు. హుజురాబాద్ లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. వ్యాపారులకు అండగా ఉంటూ వారి అభివృద్ధి తోపాటు హుజూరాబాద్ ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొల్లూరి కిరణ్, మండల అధ్యక్షురాలు లావణ్య, పట్టణ అధ్యక్షుడు సొల్లు బాబు, పట్టణ అధ్యక్షురాలు వేముల పుష్పలత, కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.