ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలి

0

కంప్యూటరీకరణ పేరుతో కాలయాపన చేయొద్దు?
. అప్పుల ఊబిలోనున్న తెలంగాణను ఎట్లా గట్టెక్కిస్తారు?
. డబ్బులే లేని స్థితిలో 6 గ్యారంటీలను ఎట్లా అమలు చేస్తారు?
. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బండి సంజయ్ కుమార్
. ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లను వెంటనే నియమించాలి

రాజన్న సిరిసిల్ల:
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో కాలయాపన చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే…వచ్చే మార్చి, ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయన్నారు. అంతకంటే ముందే ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్ వచ్చే అవకాశముంది. ఈ విషయం తెలిసి కూడా దరఖాస్తుల కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో 6 గ్యారంటీలను అమలు చేయకుండా కాలయాపన చేయడమంటే డ్రామాలాడటమే అని పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని వెంకట్రావ్ పల్లి గ్రామానికి వచ్చిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. 6 గ్యారంటీల పేరుతో కాలయాపన చేస్తూ డ్రామాలు చేస్తే ప్రజలు హర్షించరనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తాము నిర్మాణాత్మకంగా మాట్లాడుతున్నామని, గత ప్రభుత్వం మాదిరిగా అహంకార పూరితంగా వ్యవహరిస్తూ ప్రతి విమర్శలు చేస్తే బీఆర్ఎస్ నేతలకు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. అసలు అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణను ఎట్లా గట్టెక్కిస్తారో, 6 గ్యారంటీలను ఎట్లా అమలు చేస్తారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఒక్కో వ్యక్తిపై లక్షన్నర రూపాయల అప్పు భారం మోపారు. వాటినెలా తీరుస్తారు? కొత్త హామీలను ఎలా తీరుస్తారోననే ఆందోళనలో ప్రజలున్నారు. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ‘‘అట్లాగే గత 10 ఏళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇయ్యలే. రేషన్ కార్డు ప్రాతిపదికగా 6 గ్యారంటీలను అమలు చేస్తామంటే పేదలకు న్యాయం జరిగే అవకాశం లేదన్నారు. ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని, వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు.
‘‘అప్పుల బారినుండి తెలంగాణ గట్టెక్కాలన్నా… ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధులు కావాలన్నా కేంద్ర సాయం అవసరముందన్నారు. కేంద్రంలో మళ్లీ రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్ని సర్వే సంస్థలు తేల్చి చెబుతున్నాయన్నారు. అట్లాంటప్పుడు కేంద్రం నుండి అదనపు నిధులు తీసుకురావాలంటే రాష్ట్రం నుండి అత్యదిక మంది ఎంపీలను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా కేంద్రాన్ని మెప్పించి, ఒప్పించి అదనపు నిధులు తీసుకొచ్చే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలంతా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికంగా బీజేపీ ఎంపీలను గెలిపించాలని విజ్ఝప్తి చేశారు.
రాష్ట్రంలోని పాఠశాలల్లో స్కావెంజర్లు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని ప్రస్తావించగా సంజయ్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని మొత్తుకున్నా గత ప్రభుత్వం నుండి స్పందన లేదన్నారు. ఇయాళ ఉపాధ్యాయులే స్కూళ్లలో టాయిలెట్లు కడిగే దుస్థితి కన్పిస్తోందన్నారు. చాలా పాఠశాలల్లో వసతులు, టాయిలెట్స్ లేవన్నారు. అపరిశభ్రతకు నిలయాలుగా మారాయన్నారు. దీనికంతటికీ కారణం స్కావెంజర్లు లేకపోవడమే, పాఠశాలలపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడమే అన్నారు. వెంటనే రాష్ట్రంలోని పాఠశాలలన్నింటిలో స్కావెంజర్లను నియమించాలని, కనీస సౌకర్యాలన్నీ కల్పించాలని కోరారు. భారత్ ను, ప్రధాని మోదీని దూషిస్తే… ఫలితాలు ఎట్లుంటాయో మాల్దివుల ప్రభుత్వానికి రుచి చూపించిన భారతీయులకు హ్యాట్సాఫ్ చెబుతున్నా అన్నారు. భారత్ లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోదీ లక్ష్యద్వీప్ కు వెళితే.. మాల్దివులకు చెందిన ముగ్గురు మంత్రులు ప్రపంచం సిగ్గుపడేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు. ఈ నేపథ్యంలో ‘బాయ్ కాట్ మాల్దీవ్స్’’ అంటూ సోషల్ మీడియాలో భారతీయులు పెట్టిన పోస్టు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోందన్నారు. ఫలితంగా మాల్దీవుల్లోని 8,500 హోటల్లో చేసుకున్న బుకింగులు, 2,500 మంది విమాన టిక్కెట్లను భారతీయులు రద్దు చేసుకున్నారు. దీనివల్ల మాల్దీవులకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన ఆ దేశ ప్రభుత్వం ఆ ముగ్గురు మంత్రులను తొలగించి… వారి వ్యాఖ్యలు వ్యక్తిగతమని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *