పోలింగ్ సిబ్బంది విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలి: కలెక్టర్ పమేలా సత్పతి

పోలింగ్ సిబ్బంది విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలి
– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి

హుజురాబాద్:
ఈ నెల 30న జరగనున్న హుజురాబాద్ శాసనసభ ఎన్నికల విధులకు కేటాయించబడిన పోలింగ్ సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల సామాగ్రి తో పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు వచ్చిన పోలింగ్ సిబ్బందిని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనల ప్రకారం, పోలింగ్ సిబ్బంది పొందిన శిక్షణ ప్రకారం ఎన్నికలను పకడ్బందీగా సమర్థవంతంగా నిర్వహించాలని పోలింగ్ సిబ్బందికి సూచించారు. ఈవీఎం యంత్రాలను సున్నితంగా తీసుకెళ్లాలని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు వివి ప్యాట్లను ట్రాన్స్పోర్ట్ మోడ్ లో ఉంచాలని తెలిపారు. ఎన్నికల సామాగ్రిని సరి చూసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకొని ఈవీఎంలను వరుస క్రమంలో పెట్టుకోవాలన్నారు. పోలింగ్ రోజు ఉదయమే మాక్ పోలింగ్ నిర్వహించి, వివి ప్యాట్లా లోని స్లిప్పులను తొలగించి సీల్ చేయాలని అన్నారు. ఈవిఎం లు పని చేయకుంటే వెంటనే సెక్టోరల్ అధికారులకు సమాచారం ఇచ్చి రిజర్వ్ ఈవిఎం లను తెప్పించుకోవాలని సూచించారు. ఫారం 17 ఏ, 17 సి, పీవో డైరీలను రాయాలని తెలిపారు. అనంతరం పోలింగ్ సిబ్బంది (పివోలు, ఏపీఓలు, ఓపిఓలు) పోలింగ్ సామాగ్రితో పాటు సెక్టోరల్ అధికారులు, వెబ్ కాస్టింగ్ నిర్వహించే విద్యార్థులతో కలిసి తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వాహనాలలో తరలి వెళ్లారు. ఈ సమావేశంలో హుజురాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డిఓ ఎస్ రాజు, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.