అభివృద్ధి కావాలంటే బిఆర్ఎస్ ను గెలిపించండి.. మంత్రి హరీష్ రావు

చిగురుమామిడి, కోహెడ మండలాలను గోదావరి నీళ్లతో సస్యశ్యామలం చేసాం..
– కేసిఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిండు..
– తెలంగాణ భద్రతకు కేసిఆర్ భరోసా..
– సతీష్ కుమార్ ను మరొకసారి గెలిపించండి.. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగుతుంది
– కరెంటు కావాలంటే కారుకు ఓటెయ్యండి.. హరీష్ రావు

హుస్నాబాద్:
కరువుతో అల్లాడిన చిగురుమామిడి, కోహెడ మండలాలను గోదావరి నీళ్లతో సస్యశ్యామలం చేశామని మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండల కేంద్రంలో మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్, బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ మాజీమంత్రి పెద్దిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర యువనేత ఇంద్రనీల్ లతో కలిసి ఐఓసి పెట్రోల్ పంపు నుండి చిగురుమామిడి బస్టాండ్ చౌరస్తా వరకు వేలమంది గులాబీ శ్రేణులు, ఒగ్గుడోలు, కోలాటాలు, డప్పు చప్పుళ్ళు, బతుకమ్మలు, బోనాలతో మహిళలు, యువకులు కదిలి రాగా రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. హరీష్ రావు మాట్లాడుతూ..సతీషన్న గెలుపు ఖాయం అయిందన్నారు. అందరివాడు, పేదల పక్షపాతి, చదువుకునే పిల్లలకు అన్నం పెట్టి, ఆకలి తీర్చాడని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడన్నారు. నియోజకవర్గానికి రోడ్లు, విద్య, వైద్య మౌలిక సదుపాయాల రంగాలలో అభివృద్ధి చేసిండు ఆశీర్వదించండని కోరారు. ఎలక్షన్లు అంటే మూడురోజుల పండుగ కాదని, ఐదేళ్ల భవిష్యత్తు అని ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా ఉండే, ఇప్పుడు తెలంగాణ ఎలా అభివృద్ధి జరిగింది ప్రజలలో చర్చ పెట్టాలన్నారు. కాంగ్రెస్, ఎర్రజెండా పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఏ అభివృద్ధి చెందలేదని సతీషన్న ఎమ్మెల్యేగా హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ అయిందన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఐఓసీ బిల్డింగ్ ఓపెన్ చేసుకున్నామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి సామర్ధ్యాన్ని పెంచుకున్నామన్నారు. మండలానికి గోదావరి నీళ్లు తెచ్చానని ఇంకా మిగిలిన అన్ని గ్రామాలకు ఎన్నికల తర్వాత గోదావరి జలాలు అందిస్తానని, చెరువులు ఎండాకాలంలో మత్తడులు దుంకుతున్నాయన్నారు. పుష్కలంగా పంటలు పండుతున్నాయన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో మహిళా సమైక్య, వివిధ సామాజిక భవనాలు నిర్మించుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సౌభాగ్యం విలసిల్లుతున్నదని గ్రామ గ్రామానికి రోడ్లు, మురుగునీటి కాలువలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, విద్యుత్ సబ్స్టేషన్లు, గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించుకుందామని దేశంలో 55 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పాలనలో లేని అభివృద్ధి గడిచిన 9ఏళ్లలో చేసి చూపించామని హరీష్ రావు అన్నారు.
మాయ మాటలతో మోసపోవద్దు…
కర్ణాటకలో 5 గ్యారంటీలు అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బోల్తా పడ్డదన్నారు. 6 గ్యారంటీలు అని వస్తున్న వారి మాటలు విని ఆగం కావద్దని ప్రజానీకానికి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.కాంగ్రెస్ వాళ్ల పుట్టు పూర్వోత్తరాలు మనకు తెలియదా ఉచిత కరంటు అన్నారు ఉత్త కరెంటుచేసిండ్రు, వారి పాలనలో ఎరువు బస్తాల కోసం చెప్పులు లైన్లో పెట్టి నిలబడ్డ రోజులు ప్రజలు మర్చిపోవద్దని హరీష్ రావు అన్నారు. వ్యవసాయానికి ఎన్ని గంటలు కరెంటు అవసరమో తెలియని వ్యక్తి పిసిసి అధ్యక్షుడు అయ్యాడని హరీష్ రావు ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలలో చర్చ పెట్టాలన్నారు. 2023 బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో అంశాలను అందరికీ వివరించాలని పిలుపునిచ్చారు. చిగురుమామిడి మండల ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తామన్నారు. అలాగే ఓగులాపూర్ గ్రామ సమస్య స్వయంగా మీ ఊరికి వచ్చి నేను పరిష్కరిస్తానని ఆర్&ఆర్ ప్యాకేజీ కావాల్నా, మీ భూములు మీకు కావాల్నా, మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా మీరే నిర్ణయించుకోవాలన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా సతీష్ కుమార్ ను మూడవసారి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని నియోజకవర్గ ప్రజలకు హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.
మరింత అభివృద్ధి చేస్తా ఆశీర్వదించండి..
హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ 2014, 2018లో ఆశీర్వదించారని, మరింత అభివృద్ధి చేస్తానని ఈ ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. నియోజకవర్గాన్ని వేల కోట్లతో అభివృద్ధి చేశానన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నా ఈనెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా మూడవసారి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎలక్షన్లప్పుడు కనబడే టూరిస్టులను నమ్మవద్దని గుట్టలు మాయం చేసేందుకు ప్రతిపక్ష పార్టీ నాయకులు కుట్రలు చేస్తున్నారని వారి కుట్రలకు గురికావద్దని ప్రజానీకానికి తెలిపారు.
బిఆర్ఎస్ లో చేరిక..
హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు మద్దతుగా చిగురుమామిడి మండలం వివిధ గ్రామాల నుండి వందలాది మంది వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి హరీష్ రావు, సతీష్ కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు.