హుస్నాబాద్ గడ్డ చైతన్యం, విప్లవ ఉద్యమాలకు వేదిక: కేటీఆర్

హుస్నాబాద్ గడ్డ చైతన్యం, విప్లవ ఉద్యమాలకు వేదిక..
. మోడీ పిరమైన ప్రధాని
. దరిద్రానికి నేస్తం హస్తం, అది మనకొద్దు
. తెలంగాణలో మళ్లీ గెలిచేది బిఆర్ఎస్, కేసిఆరే..
. సతీషన్న నా పెద్దన్న, మంచి మనిషి మళ్లీ గెలిపించండి..
. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హుస్నాబాద్:
హుస్నాబాద్ చైతన్య వంతమైన గడ్డ, విప్లవ ఉద్యమాలకు వేదికని, గడ్డపై మూడోసారి బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో జరిగిన రోడ్ షో కార్యక్రమంలో హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్, హుస్నాబాద్ బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ పెద్దిరెడ్డి లతో కలిసి పాల్గొన్నారు. ఈ రోడ్ షోకు డప్పుచప్పులతో, కోలాటాలతో, బతుకమ్మలు, బోనాలతో, ఒగ్గుడోలులతో, మహిళలు, యువకులు, వృద్ధులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ…హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గడిచిన తొమ్మిదిన్నర ఏళ్లలో సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున 9076 కోట్ల రూపాయలు నిధులు తెచ్చారన్నారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చాడు మళ్లీ అతి భారీ మెజారిటీతో గెలిపించి మీ మార్కులన్నీ ఆయనకే వేయాలని ప్రజలను కోరారు. సతీష్ అన్న మంచివాడు నాకు పెద్దన్నలాంటి వాడని, ఆయన ఏది అడిగినా కేసీఆర్ నేను కాదనలేదన్నారు. అవసరమైన నిధులు ఇచ్చాం..గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి హుస్నాబాద్ కు కరువును దూరం చేసిండన్నారు. భూనిర్వాసితులకు దేశంలో ఎక్కడా ఇవ్వనటువంటి అత్యధిక పరిహారం ఇప్పించాడన్నారు. ఆయనను గెలిపించుకోండి ఇంకా అభివృద్ధి చేసి చూపెడతాడని కేటీఆర్ ప్రజలను విజ్ఞప్తి చేశారు.

11 సార్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్ చేసింది ఏమిటి…
కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అని ఇప్పుడు అడుగుతున్నారని 11 సార్లు ఛాన్స్ అవకాశం ఇస్తే దేశాన్ని ఏం ఉద్ధరించారని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు ఉండేది కాదని, కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, వ్యవసాయం నడవలేదన్నారు. పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. బిజెపి పార్టీ, ప్రధాన మంత్రి మోడీ నల్లదనం తెస్తానని, ప్రజలందరికీ పంచుతానని మోసం చేసారన్నారు. నల్లధనం మాటేమో కానీ ప్రియమైన ప్రధాని ప్రతిదీ ఫిరం చేశాడన్నారు. ఉప్పు, పప్పు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచిండన్నారు.
ప్రజాసంక్షేమ బిఆర్ఎస్ లక్ష్యం..
కేసిఆర్ ప్రవేశపెట్టిన 2023 మేనిఫెస్టో ప్రకారం సౌభాగ్య లక్ష్మి, 400కే గ్యాస్ సిలిండర్, రైతుబంధు 16 వేల రూపాయలు, కేసిఆర్ బీమా, రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం ఈ జనవరి నుండి అందజేస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని కేటీఆర్ తెలిపారు. గాడిదలకు గడ్డి వేసి ఆవు పాలు పిండి నట్టు ప్రతిపక్ష పార్టీ నాయకుల మాయ మాటలు నమ్మి గోస పడవద్దని పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కారు గుర్తుకే ఓటేసి మళ్లీ సతీష్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ ప్రజలను కోరారు.
ఆదరించి ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసే బాధ్యత నాదే..
హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ మాట్లాడుతూ.. 2014,2018 లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించారని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని తెలిపారు. మూడవసారి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని ఆదరించి ఆశీర్వదించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సతీష్ కుమార్ కు మద్దతుగా రోడ్ షో కు హాజరైన ప్రజలందరూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై సతీష్ కుమార్, కారు గుర్తుకే మన ఓటు అని నినాదాలతో హోరెత్తించారు. హుస్నాబాద్ బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడిప్పుడే అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని ప్రతిపక్ష పార్టీ నాయకుల మాటలు విని మోసపోవద్దన్నారు. ప్రజలందరూ కారు గుర్తుకు ఓటెయ్యాలని సతీష్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.