ఎన్నికల నియమావళి పాటించాలి
- శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
- కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి
హుజురాబాద్:
శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి అన్నారు. బుధవారం హుజరాబాద్ లోని ఎన్నికల అధికారి కార్యాలయాన్ని ఆయన సందర్శించి పరిశీలించారు. నామినేషన్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉందని, ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల సందర్భంగా పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కేంద్ర బలగాలు సైతం బందోబస్తు కోసం వచ్చాయన్నారు. పార్టీల అభ్యర్థులు ర్యాలీలు, రోడ్డు షోలు చేసే ముందు తప్పనిసరిగా రిటర్నింగ్ అధికారి వద్ద అనుమతి పొందాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఆ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలు సజావుగా సాగేలా పార్టీలు నాయకులు ప్రజలు సహకరించాలని కోరారు. సిపి వెంట హుజురాబాద్ ఏసిపి జీవన్ రెడ్డి పట్టణ సిఐ బొల్లం రమేష్ లు ఉన్నారు.