రాజకీయాల కంటే నాకు ధర్మమే ముఖ్యం

రాజకీయాలకంటే నాకు ధర్మమే ముఖ్యం..
. అవసరమైతే ధర్మం కోసం రాజకీయాల నుండి తప్పుకునేందుకు సిద్ధం..

కరీంనగర్:
బరాబర్ హిందూ ధర్మం గురించి మాట్లాడుతూనే ఉంటానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకు రాజకీయాలకంటే ధర్మమే ముఖ్యమని, హిందూ ధర్మం కోసం అవసరమైతే రాజకీయాల నుండి తప్పుకునేందుకు కూడా వెనుకాడనని స్పష్టం చేశారు. హిందూ ధర్మ రక్షణ కోసం, ప్రజల కోసం నా జీవితాన్నే ధారపోసిన అని, ధర్మం కోసం కొట్లాడిన నేను ఏనాడూ చావుకు భయపడలే… చావే నన్ను చూసి భయపడిందన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలాంటోడు, రాజాసింగ్ లాంటి వాళ్లను గెలిపించకపోతే… ఇకపై ఎవరూ హిందూ ధర్మం గురించి మట్లాడే వారుండరన్నారని, ప్రజలంతా ముఖ్యంగా యువకులంతా గుర్తుంచుకోవాలని చెప్పారు. కరీంనగర్ లోని వివిధ డివిజన్లకు చెందిన 500 మంది యువకులు శుక్రవారం సాయంత్రం బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అరుణ్ శివాలయం ఆధ్వర్యంలో ఎంపీ కార్యాలయానికి వచ్చిన వీరందరికీ కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. నిజమైన నిఖార్సైన భయంకరమైన హిందువును నేనేనని చెప్పుకున్న కేసీఆర్ కు పాతబస్తీకి పోవాలంటే అన్నీ తడుస్తయ్ అంటూ ఎద్దేవా చేశారు. అక్కడికి పోవాలంటే ఒవైసీ పర్మిషన్ కావాలట… మరి నేను సవాల్ చేసి పాతబస్తీపోయి సభపెట్టి కాషాయ జెండా సత్తా చాటానన్నారు. ఎంఐఎం, బీఆర్ఎస్ ఆగడాలను అడ్డుకునేందుకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణలోని హిందుత్వవాదులంతా వచ్చి పనిచేసి 4 సీట్ల నుండి 48 సీట్లను గెలిపించారని తెలిపారు.