హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

బిజెపి, బిఆర్ఎస్ లు దొందు దొందే..
– హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
– 1000 కోట్లతో అభివృద్ధి చేస్తానంటే వద్దన్నమా…?
– హుజురాబాద్ కు ఈటెల చేసింది ఏమీ లేదు
– ఆశీర్వదించి అవకాశం కల్పించండి
– కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్

హుజురాబాద్ :
బిజెపి, బిఆర్ఎస్ ప్రభుత్వాలు దొందు దొందేనని, బిఆర్ఎస్ కు ఓటు వేస్తే బిజెపికి వేసినట్లేనని, బిజెపికి వేస్తే బిఆర్ఎస్ కు ఓటు వేసినట్లేనని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ అన్నారు. శనివారం హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట, వెంకట్రావుపల్లి, సిర్సపల్లి, రాంపూర్, జూపాక, బోత్తలపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజులకు హామీల అమలు చేస్తామన్నారు. బిఆర్ఎస్, బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయాలని అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని, పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, అక్కడ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, కర్ణాటక రాష్ట్రంలో 62 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని హామీలన్నీ అమలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కాపీ చేసి పింఛన్లు పెంచేస్తామని టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుందని, ఉన్న పింఛన్లు సమయానికి ఇవ్వడం లేదు కానీ కొత్త పింఛన్లు ఇస్తామని హామీ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు.

ప్రతి మండలంలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తా…
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. యువకులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు సరైన వసతులు లేవని, తనను గెలిపిస్తే హుజురాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో డిజిటల్ లైబ్రరీలతోపాటు స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తానని హామీ ఇచ్చారు. వేయికోట్ల నిధులతో హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మాటలు చెబుతున్నా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్సీ ఇప్పుడు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మండలానికో ఇంటర్నేషనల్ స్థాయి పాఠశాల ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి విద్యానందించేందుకు కృషి చేస్తామన్నారు.

హుజురాబాద్ కు ఈటెల చేసింది ఏమీ లేదు….
రెండు దశాబ్దాలుగా ప్రజలు ఈటల రాజేందర్ ను గెలిపిస్తూ వస్తున్నారని, ఈ నియోజకవర్గ ప్రజలను కాదని గజ్వేల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు. గజ్వేల్ కు వెళ్లి గజ్వేల్ ముద్దుబిడ్డనని, హుజురాబాద్ కు వచ్చి మీ బిడ్డనని చెప్తున్నాడని అన్నారు. ఏడుసార్లు అవకాశం ఇచ్చినప్పటికీ ఈ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల్లో గెలిచి మూడేళ్లు గడుస్తున్న హుజురాబాద్ కు ఏమి చేయలేదని, కనీసం తన సొంత మండలమైన కమలాపూర్ మండలంలోని ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని సైతం పూర్తి చేయలేని పరిస్థితిలో ఈటల రాజేందర్ ఉన్నారన్నారు. ప్రశాంతంగా ఉన్న హుజురాబాద్ లో రౌడీయిజం పెరిగిపోయిందన్నారు. వ్యాపారులు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. వ్యాపారులకు స్వేచ్ఛ ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వ్యాపారాలను అభివృద్ధి చేయడంతో పాటు పరిశ్రమలను తీసుకువచ్చి ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. వ్యాపారులెవరు అధైర్య పడవద్దని హుజురాబాద్ నియోజకవర్గం లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. వ్యాపారులకు అండగా ఉంటూ వారి అభివృద్ధి తోపాటు హుజూరాబాద్ ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిక….
జూపాక గ్రామంలో వార్డ్ మెంబర్లు తాళ్లపల్లి రాజేందర్, పంజాల సురేందర్, ఎల్లయ్య మునిగాల కరుణ, ఆనందం, కవిత, బొత్తలపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ సుంకరి స్వరూప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ సమక్షంలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొల్లూరు కిరణ్, పిసిసి సభ్యులు పత్తి కృష్ణారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పారపు సంపత్, నియోజకవర్గ అధ్యక్షుడు చల్లూరి రాహుల్, మండల అధ్యక్షురాలు లావణ్య తోపాటు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.