ప్రజల కోసం చావడానికి అయినా సిద్ధం…

 

వాళ్లది కబ్జాల ఆరాటం….నాది పేదల పోరాటం..
. ఎటువైపు ఉంటారో మీరే తేల్చుకోండి
. కరీంనగర్ ప్రజలకు బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ పిలుపు
. బియ్యం టెండర్లలో రూ.1300 కోట్ల గోల్ మాల్ చేసిన గంగుల
. కేసీఆర్ ఇంట్లో 5గురికి పదవులున్నయ్…
. నిరుద్యోగులు ఏం పాపం చేశారు..ఇంటికో ఉద్యోగం ఏమైంది?

కరీంనగర్:
గంగుల కు 2సార్లు అధికారమిస్తే భూములు కొల్లగొట్టిండు… గుట్టలనే ధ్వంసం చేసిండు.. పొరపాటున మళ్లీ గెలిపిస్తే..ఈసారి ఏకంగా మీ ఇండ్లను కొట్టేయడం ఖాయం… గంగులతో పాటు కాంగ్రెస్ అభ్యర్ధిది భూకబ్జాల పంచాయతీ… నాది పేదల కోసం ఎంతకైనా తెగించి కొట్లాడే నైజం… ఎటువైపు ఉంటారో మీరే తేల్చుకోండి.. అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ప్రజలను కోరారు. కరీంనగర్ నియోజకవర్గంలోని జూబ్లీనగర్, ఫకీర్ పేటలో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ కు రెండుసార్లు అధికారమిస్తే ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసి పుట్టబోయే బిడ్డపై కూడా లక్షన్నర రూపాయల అప్పు భారం మోపారని మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్ధికి కరీంనగర్ గురించే తెల్వదని, రేషన్ కార్డులు ఎట్లస్తిరో.. పెన్షన్ ఎట్లస్తిరో కూడా తెల్వదన్నారు. భూకబ్జాలు తప్ప మరేమీ తెల్వదని, ప్రజల కోసం ఎన్నడూ కొట్లాడలేదని విమర్శించారు. మీకోసం ఎన్నడైనా డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం కొట్లాడారా? పెన్షన్, రేషన్ కార్డుల కోసం ఉద్యమించారా? అని అడిగారు. వడగండ్ల వాన కోసం పరిహారం ఇవ్వకపోతే నేను కొట్లాడిన అని, పద్మశాలీలు కలర్ వేయొద్దని మీపై ఒత్తిడి తెస్తే నేను అడ్డుకున్నా మీ ఇండ్ల కోసం నేను పోరాడిన, మీ పిల్లల కోసం నేను ఉద్యమించిన వ్యక్తిని నేనని ఉద్వేగ పూర్వకంగా మాట్లాడారు. ఎంపీగా ఎన్నికైప్పటి నుండి మీకోసం పోరాడుతూనే ఉన్నా ఎన్నడూ ఇంట్లో కూర్చోలేదన్నారు. కేంద్రం నుండి రూ.9 వేల కోట్లు తీసుకొస్తే నేను నిధులు తీసుకొస్తే, గంగుల ఆ నిధులు తానే తెచ్చినట్లు ఫోజులు కొడుతూ కొబ్బరికాయలు కొడుతున్నడని విమర్శించారు. రేషన్ బియ్యం ఉచితంగా పేదలకు ఇచ్చేది కేంద్రమే కానీ సిగ్గు లేకుండా కేసీఆర్ ఫొటో పెట్టుకుంటున్నడన్నారు. అబద్దాలాడటంలో గంగులను మించినోడు లేరన్నారు. డబ్బులు పంచి, అబద్దాలాడి ప్రజలను మోసం చేయడంలో గంగుల నెంబర్ వన్ అన్నారు. రేషన్ మంత్రిగా ఉంటూ రేషన్ కార్డులే ఇయ్యలేని వ్యక్తి బీసీ మంత్రిగా ఉంటూ బీసీ బంధు కూడా ఇవ్వలేదని విమర్శించారు. 2 సార్లు అధికారమిస్తే భూకబ్జాలు చేసిండని, గుట్టలు మాయం చేసిండని, పొరపాటున మళ్లీ గెలిస్తే.. మీ ఇండ్లను కూడా కొట్టేయడం ఖాయం అన్నారు. బండి సంజయ్ అవినీతిపరుడని ఆరోపణలు చేస్తున్న గంగుల అధికారంలో ఉండి ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. నా ఆస్తిపాస్తుల డాక్యుమెంట్లన్నీ తీసుకువస్తా..అవన్నీ ప్రజలకు పంచేస్తా… మరి నువ్వు కూడబెట్టిన ఆస్తిపాస్తుల డాక్యుమెంట్లన్నీ పట్టుకొస్తా… ప్రజలకు రాసిచ్చేందుకు సిద్దమా అన్నారు. ప్రజల కోసం చావడానికైనా వెనుకాడని నైజం నాదని ఎటువైపు ఉంటారో మీరే తేల్చుకోవాలని ప్రజల కోరారు.