నా ఆస్తిపాస్తులన్నీ ఈ క్షణమే ప్రజలకు రాసిచ్చేందుకు సిద్ధం: బండి సంజయ్

బియ్యం టెండర్లలో గోల్ మాల్ పై ప్రమాణం చేయడానికి సిద్ధమా..?
. రూ.1300 కోట్ల గోల్ మాల్ చేసినట్లు నేను నిరూపిస్తా..
. రేషన్ బియ్యం, వడ్ల కొనుగోలు పైసలన్నీ కేంద్రానివేనని నిరూపిస్తా…
. పంట నష్టపోయి ఇక్కడ రైతులు గోస పడుతుంటే… పంజాబోళ్లకు పైసలిస్తవా?
. నా ఆస్తిపాస్తులన్నీ ఈ క్షణమే ప్రజలకు రాసిచ్చేందుకు సిద్దం…
. గంగుల తన ఆస్తిపాస్తులను ప్రజలకు రాసిచ్చే దమ్ముందా..?
. కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్

కరీంనగర్:
పౌరసరఫరాల శాఖ మంత్రిగా గంగుల బియ్యం టెండర్లలో రూ.13 వందల కోట్ల గోల్ మాల్ చేశారని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ చెప్పారు. గురువారం బహుదూర్ ఖాన్ పేట, తాహెర్ కొండాపూర్ గ్రామాల్లో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. గంగుల కమలాకర్ నిజంగా తప్పు చేయలేదని భావిస్తే…దేవుడి గుడి వద్దకొచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. రేషన్ షాపుల్లో పేదలకు ఇచ్చే ఉచిత బియ్యం పైసలన్నీ కేంద్రమే భరిస్తోందన్నారు. ఐకేపీ కేంద్రాలు, ధాన్యం కళ్లేలా వద్ద రైతుల నుండి కొనే వడ్ల పైసలన్నీ కేంద్రమే చెల్లిస్తోందన్నారు. వడ్లను సేకరించినందుకుగాను కేసీఆర్ ప్రభుత్వానికి బ్రోకరేజీ రూపంలో కమీషన్ కూడా కేంద్రమే ఇస్తోందన్నారు. వీటికి సంబంధించి లెక్కాపత్రంతో వివరాలు తనవద్ద ఉన్నాయని, బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. పౌరసరఫరాల మంత్రిగా ఉంటూ కరీంనగర్ ప్రజలకు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, బీసీ మంత్రిగా ఉంటూ బీసీలకు బీసీ బంధు పైసలియ్యలేదన్నారు. వీటిపై తాను ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలబడితే… కేసీఆర్ తనపై 74 కేసులు పెడితే… గంగుల తనను అవినీతిపరుడిగా చిత్రీకరిస్తూ ప్రజలను దారి మళ్లించే కుట్ర చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా గంగులకు ఆయన సవాల్ విసిరారు. నేను నిజంగా అవినీతికి పాల్పడితే.. ఆ ఆస్తిపాస్తులకు సంబందించిన డాక్యుమెంట్లన్నీ తీసుకురా… అవన్నీ ప్రజలకు రాసిచ్చేస్తా… అట్లాగే నీ ఆస్తిపాస్తుల డాక్యుమెంట్లన్నీ నేను తీసుకొస్తా… వాటిని నువ్వు ప్రజలకు రాసిచ్చేందుకు సిద్ధమా?అంటూ ప్రశ్నించారు. వడగండ్ల వానతో పంట నష్టపోతే కేసీఆర్ ఈ జిల్లాకు వచ్చి ఏమన్నడు.. ఎకరాకు రూ.10 వేలు ఇస్తానన్నడు.. ఇచ్చిండా? తెలంగాణలో రైతులంతా నష్టపోయి ఏడుస్తుంటే నయా పైసా ఇయ్యలే.. మన సొమ్ము తీసుకుపోయి పంజాబ్ లో ఇస్తాడా? ఈసారి కేసీఆర్ బుద్ది చెప్పాల్సిందేనని పిలుపునిచ్చారు. బీటెక్ చదివి ఉద్యోగాల కోసం కష్టపడి కోచింగ్ తీసుకునే కావ్య లాంటి నిరుద్యోగులు రాష్ట్రంలో 50 లక్షల మంది ఉన్నారన్నారు. ఉద్యోగాల్లేక ఇంటికి భారమై రోడ్ల మీద తిరుగుతున్న వాళ్లెందరో ఉన్నరని తెలిపారు. వాళ్ల పక్షాన పోరాడి జైలుకు పోయిన. నేను ప్రజల కోసం కొట్లాడితే కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట్ 74 కేసులన్నారు. కరీంనగర్ ప్రజలంతా బీఆర్ఎస్ ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసి నామీద దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి వాస్తవాలు ఆలోచించి ఓటేయాలని కోరారు.