వరదవెల్లిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా
దత్తాత్రేయ ఆలయాన్ని దత్తత తీసుకుంటా…
. అధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తా..
. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్
రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని వరదవెల్లిలోని దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దత్తత తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. వరదవెల్లి ప్రాంతాన్ని ప్రసిద్ధి చెందిన అధ్యాత్మిక, పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతానన్నారు. భక్తులకు అవసరమైన పడవలను కూడా అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. త్రిమూర్తుల స్వరూపమైన దత్తాత్రేయ స్వామి జయంతిని పురస్కరించుకుని బండి సంజయ్ కుమార్ మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని వరదవెల్లి గ్రామంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, స్థానిక నేతలతో కలిసి పడవలో వెళ్లి మధ్యమానేరులోనున్న దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పురాతన దేవాలయమైన దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్నా, స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయనే విశ్వాసం భక్తుల్లో ఉందన్నారు. దత్తాత్రేయ జయంతి సందర్భంగా మూడు రోజులు ఉత్సవాలు నిర్వహిస్తారన్నారు. స్వామి వారిని దర్శించుకోవడం దారి లేకపోవడం, సరైన సౌకర్యాలు లేకపోవడంవల్ల భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో దేవాలయ కమిటీ విజ్ఞప్తి మేరకు దత్తాత్రేయ ఆలయాన్ని దత్తత తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, అట్లాగే ఈ ప్రాంతాన్ని ప్రసిద్ది చెందిన ధార్మిక క్షేత్రం, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు.