దరఖాస్తుదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
దరఖాస్తు దారులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలి
. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
హుజురాబాద్:
ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు దారులకు ఇబ్బందులు కలుగకుండా కనీస ఏర్పాట్లను చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. బుధవారం హుజురాబాద్ మండలం వెంకట్రావ్ పల్లి, సిర్సపల్లి గ్రామాలతో పాటు హుజూరాబాద్ పురపాలక సంఘ కార్యాలయంలో 14, 24 వార్డుల్లో నిర్వహిస్తున్న ప్రజాపాలన కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాపాలన కేంద్రాలకు వచ్చే దరఖాస్తు దారులకు ఇబ్బందులు తలెత్తకుండా టెంట్, మంచినీరు, కుర్చీల వంటి కనీస ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాలకు వచ్చే వయోవృద్ధులు, వికలాంగులు, మహిళల కొరకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. రేషన్ కార్డు కొరకు తెల్లకాగితం పై ఇచ్చే దరఖాస్తులతో పాటు కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న రశీదులను కూడా తీసుకోవాలన్నారు. ఇప్పటికే సమర్పించిన దరఖాస్తు దారుల నుండి రేషన్ కార్డుల రశీదులను తీసుకుని దరఖాస్తులకు జతపరచాలని తెలిపారు. కేంద్రాలను నిర్వహించే గ్రామాలు, వార్డుల వారీగా దరఖాస్తుల పంపిణీ పూర్తి కావాలని, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఈ నెల 6వ తేది వరకు కొనసాగించాలని, వచ్చే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని ఆదేశించారు. దరఖాస్తు నమోదులో అవసరమైన వారికి సహాయాన్ని అందించాలన్నారు. కిరాయి ఇంట్లో ఉండేవారి పేరున కరెంట్ మీటర్ ఉండదు కాబట్టి దరఖాస్తుపై కిరాయి ఇంటి దారుగా నమోదు చేయాలని సూచించారు. కేంద్రాలకు వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేంద్రం వద్ద దరఖాస్తును రాయలేని వారి కొరకు సహాయకులను ఏర్పాటు చేయాలని, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి వాతావరణంలో వస్తున్న మార్పులతో వచ్చే సీజనల్, ఇతర వ్యాధుల కొరకు మందులను అందుబాటులో ఉంచుకోని అవసరమైన వారికి అందించాలని ఆదేశించారు. ఏ రోజు కారోజు వచ్చిన దరఖాస్తులను ఎక్సల్ ఫార్మాట్ లో నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఆర్డీవో రాజు, మున్సిపల్ కమిషనర్ సమయ్య, ప్రత్యేకాధికారి పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.