కరీంనగర్ లో ఆ పార్టీకి ఎదురీత…
కాంగ్రెస్ ఎదురీత..!
. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి..
. కరీంనగర్ పార్లమెంటులో మాత్రం ఎదురీత
. 4గురు ఎమ్మెల్యేలూ నామ మాత్రమే…
. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ స్తబ్దత
. సోషల్ మీడియా, ప్రచార కర్తలున్నా అంతంతే !
కరీంనగర్:
కాంగ్రెస్కు దేశ వ్యాప్తంగా గాలి వీస్తోంది. కరీంనగర్ పార్లమెంటులో మాత్రం ఆ పార్టీ ఎదురీదుతోంది. అభ్యర్థి స్థానికులకు తెలియక పోవడం..పార్టీల్లో అంతర్గత విభేదాలు..సమన్వయ లేమి..ఇలా అనేక కారణాలతో ఇక్కడ వెనుకబడుతోంది. రాష్ట్ర మంత్రి పొన్నం ఇక్కడే మకాం వేసి..విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా..ఓటు బ్యాంకు మాత్రం పెరిగే అవకాశాలు కనిపించడం లేదు.
కరీంనగర్ పార్లమెంటు నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఎదురీదుతున్నారు. లేటుగా అభ్యర్థిని ఖరారు చేయడంతో పాటు నియోజకవర్గంలో ఆయనకు పట్టు లేకపోవడం మైనస్గా మారింది. పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నప్పటికీ..అసెంబ్లీ ఎన్నికల్లో వారికి పోలైన ఓట్లను పదిల పర్చుకునే పరిస్థితులు కనబడడం లేదు. ఎమ్మెల్యేల ప్రచార తీరు, క్యాడర్లో గందరగోళ పరిస్థితులు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో సుడా ఛైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని తొక్కెయడానికి డమ్మీలైన పద్మాకర్ రెడ్డి, అంజన్ కుమార్ లకు ప్రాధాన్యతివ్వడంపై పని చేసే క్యాడర్ జీర్ణించుకోవడం లేదు. ఇక..ఇక్కడి అసెంబ్లీ నియోజక వర్గ ఇంఛార్జి పురమల్ల శ్రీనివాస్ అడ్రస్ లేకుండా పోయారు. విజిలెన్స్ రిపోర్ట్తో పంచాయతీ అధికారి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు కాగా..అప్పటి నుండి అబ్స్టాండింగ్ లో ఉన్నారు. అయినా..పురుమల్ల ఫోటోలతో ఈ అసెంబ్లీలో ప్రచారం చేయడం వల్ల వెలిచాలకు మైనస్గా మారింది. ఇక్కడ గత అసెంబ్లీ ఫలితాలు ఈ పార్లమెంటులో రిపీట్ అయ్యే అవకావాలున్నట్లు చర్చ జరుగుతుంది.
హుస్నాబాద్ అసెంబ్లీ నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డిని ప్రవీణ్ రెడ్డిని పక్కన పెట్టడం వల్ల ఈ నియోజకవర్గంలోని ఆయన వర్గంతో పాటు మొత్తం పార్లమెంటులో రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో రెడ్డి సోదరులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. అల్గిరెడ్డిని పక్కన బెట్టి బీజేపీ నేత బొమ్మ శ్రీరాంను కాంగ్రెస్లోకి తీసుకొచ్చి వెంట తిప్పుకోవడం వల్ల సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న క్యాడర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇలా మంత్రి పొన్నం తన సొంత నియోజక వర్గంలోనూ అల్గిరెడ్డిని పక్కనబెట్టి వ్యతిరేకత మూటగట్టుకున్నట్లు చర్చ జరుగుతుంది.
మానకొండూర్ అసెంబ్లీ నియోజక వర్గంలోనూ కాంగ్రెస్కు గత అసెంబ్లీకి భిన్నంగా పరిస్తితులున్నాయి. డీసీసీ అధ్యక్షులుగా, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ.. ఇక్కడ పెద్దగా ప్రచారం నిర్వహించడం లేదనే అభిప్రాయం వ్యక్తమౌతుంది. ఏడు మండలాల్లోనూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలేవీ చేయలేదు. అధికారంలో ఉన్నప్పటికీ..కాంగ్రెస్ అమలు చేసిన పథకాలు, చేచబోయే పథకాల ఊసే లేదు. ఇక జాతీయ స్థాయి మెనిఫెస్టోను ఎక్కడా ప్రచారం చేయడం లేదు. దీంతో క్యాడర్ లోనూ స్తబ్దత నెలకొంది.
సిరిసిల్ల అసెంబ్లీలోనూ క్యాడర్ పెరగని పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల నేత కార్మికులు మృతి చెందిన సందర్భంగా ప్రభుత్వం రూ. 50 కోట్లు విధుల విడుదల..ఆసాములు, పెట్టుబడి దారుల మధ్య వైరాన్ని పెంచింది. ఇక్కడి కార్మికులకు ఉపాధి కల్పించే అంశంపై అధికారుల నుండి కనీస హామీ ఇప్పించలేని పరిస్థితులో మంత్రి పొన్నం ఉండడంతో కార్మికుల ఓట్లపై ప్రభావం చూపే అకాశాలున్నాయి. కేకే మహేందర్ రెడ్డి, సింగీతం శ్రీనివాస్ ల ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది.
చొప్పదండి నియోజక వర్గంలోనూ కాంగ్రెస్కు పరిస్థితులు అనుకూలంగా లేనట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యేగా గెలిచాక ఆయా గ్రామాల్లో పర్యటించి..సమస్యలు తెలుసుకోలేదనే అభిప్రాయం ఆయా ప్రాంతాల ప్రజల్లో నెలకొంది. పట్టణ, మండల, గ్రామ స్థాయి నేతలు ఎక్కడా ప్రచారంలో కనబడని పరిస్థితులున్నాయి. వేములవాడ అసెంబ్లీ నియోజక వర్గంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కొంత కష్టపడుతున్నా..పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది.
కరీంనగర్ పార్లమెంటు నియోజక వర్గంపై అదిష్టాపం పెద్దగా ఆశలు పెట్టుకున్నట్లు కనబడటం లేదనే చర్చ పార్టీలో జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ పాదయాత్రలో భాగంగా కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్కు జన సమీకరణలో ఇక్కడి నేతలు ఫెయిల్ అయినట్లు గుర్తించింది ఆ పార్టీ. దీంతో ఇటీవల రాహుల్ గాంధీ మరోసారి సభలో పాల్గొనేందుకు నిరాకరించినట్లు అంతర్గతంగా చర్చ జరుగుతుంది.
