లోక్ సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం
హైదరాబాద్:
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు ఆ పార్టీ నాయకులు వ్యూహాలు రచించుకుంటున్నారు. తప్పకుండా ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో గులాబీ జెండాను అధిక స్థానాల్లో గెలిపిస్తామని పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గ అభ్యర్థి మాలోతు కవితకు ఘన విజయం చేకూర్చేందుకు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎంపీలు పసునూరి దయాకర్, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ లు భేటీ అయ్యారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర నివాసంలో కవిత, దయాకర్, సీతారం నాయక్ లు ఆయన(వద్దిరాజు)తో మంగళవారం సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఘన విజయమే లక్ష్యంగా, ధ్యేయంగా, అంకితభావంతో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ విషయమై సుధీర్ఘంగా చర్చించి..వ్యూహరచన చేశారు.
లోకసభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్,నోటీఫికేషన్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో వారు సమాలోచనలు జరిపారు. పార్టీ ప్రముఖుల పర్యటనలు, నాయకుల్ని సమన్వయం పర్చడం,సభలు,సమావేశాల తేదీల ఖరారు, ప్రచారసరళి, కార్యకర్తలకు దిశానిర్దేశం,ప్రజలతో నేరుగా మమేకమవ్వడం,ఎజెండా,సంబంధిత అంశాలపై ఎంపీ రవిచంద్ర, కవిత, దయాకర్,మాజీ ఎంపీ సీతారాం నాయక్ లు సమాలోచన చేశారు.