బిఆర్ఎస్ ను ఓడించి బాధపడుతున్న ప్రజలు…
ప్రజల సమస్యలపై పోరాడే పార్టీ బిఆర్ఎస్..
. బిఆర్ఎస్ ను ఓడించి బాధపడుతున్న ప్రజలు…
. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహనంతో ప్రజలు
. విద్యుత్తును 7 వేల మెగావాట్ల నుంచి 26 వేల మెగావాట్లకు పెంచిన ఘనత కేసీఆర్ ది
. బిఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్
హుజురాబాద్:
బిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అని, ప్రజల సమస్యలపై పోరాడటం తప్ప పదవుల కోసం ఆరాటం లేదని, రాష్ట్ర మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శనివారం హుజురాబాద్ లోని సాయి రూప గార్డెన్లో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నామన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెడితే కోట్లాది మంది ఆయన వెంట నడిచారన్నారు. రాజకీయంలో గెలుపు ఓటములు సహజమన్నారు. బిఆర్ఎస్ పార్టీ రాజకీయంగా ఓడిపోయినప్పటికీ కేసీఆర్ మాత్రం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలకు నోచుకోని హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజలను ఇబ్బంది పెడుతున్నదన్నారు. గెలిచి రెండు నెలలు కాకముందే కాంగ్రెస్ పార్టీ విధానాలతో ప్రజలు విసిగిపోతున్నారని, ఆ పార్టీపై ప్రజలంతా అసహనంగా ఉన్నారన్నారు. బిఆర్ఎస్ పార్టీని ఉద్యమ సమయంలోనే అనగదొక్కాలని చూసిన పార్టీలు తెలంగాణలో కనుమరుగయ్యాయని, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసిన బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజల నుంచి దూరం చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పదవులను తృణపాయంగా వదిలేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని, పార్లమెంట్ లో ఇద్దరం ఎంపీలం ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశామని గుర్తు చేశారు. తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో 7778 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేదని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నిర్మాణం చేసి పదేళ్ళలో 26 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు. దేశంలోనే వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. గత ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు 50వేల మెజారిటీ ఇచ్చారని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు.
అధైర్య పడొద్దు… అండగా ఉంటా…
. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
తనకు మెజారిటీ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలందరికీ రుణపడి ఉంటానని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని ఎవరికి ఏ సమస్య వచ్చిన స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు ఎవరు అధైర్య పడొద్దని ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో పూర్తి స్థాయిలో విఫలమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోతారన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ సమిష్టిగా కృషి చేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, టూరిజం డెవలప్మెంట్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, జమ్మికుంట చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్ రావు, నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.